Tuesday, September 29, 2009

దసరా - శమీ చెట్టు, పాల పిట్ట.



ఇది పాల పిట్ట!.. దసరా రోజున ఈ పిట్టను చూడాలి అని నానుడి. కనబడితే అదృష్టం కలిసి వస్తుందని ఆనుకునేవాళ్ళు. నేను చిన్నప్పుడు దసరా రోజున ఊరిబయటకి వెళ్ళితే స్వేచ్ఛగా కనపడేది.. నీకెన్ని కనపడ్డాయి, నాకెన్ని కనపడ్డాయి.. అంటూ ఓ ట్రెండు రోజులదాకా చర్చించుకునేవాళ్ళం. ఆ పిట్ట కనిపిస్తే చప్పట్లు కొట్టి ఇతరులు చూసేలా చేసెడివారు. కనీసం రెండు మూడు పిట్టలైనా చూసేవాళ్ళము. ఇప్పుడు క్రాంక్రీటు కీకారణ్యాలు వచ్చాక ఇలా పంజరాల్లో తప్ప బయట చూడలేము! ఇంకొద్ది రోజులయ్యాక ఇదీ చూస్తామో లేమో!

తెలంగాణా జిల్లాల్లో పాలపిట్టకి ఎంతో ప్రాధాన్యత ఉంది. చూడడానికి పిడికెడు అంతగా ఉండే ఈ పాలపిట్ట సాధారణముగా పొలాల్లో కనపడుతూ ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే దసరా రోజున కనపడటం చాలా కష్టం. విజయదశమి రోజున ఈ పిట్ట కనిపిస్తే విజయం సిద్ధిస్తుందని చాలా నమ్మకం. దీనికోసం చిన్నా, పెద్దా అంటూ తేడా లేకుండా చెట్టూ, పుట్టా గాలిస్తారు.. ఈ పిట్ట కనిపిస్తే తాము ధరించిన చెప్పులు వదిలి ఆ పిట్ట వంక చూస్తూ మ్రొక్కుతారు. ఇంత విలువ దీనికేందుకు అంటే - పాండవులు తమ అరణ్య, అజ్ఞాత వాసాలు ముగించుకొని రాజ్యానికి వస్తుండగా ఈ పాలపిట్ట కనపడింది - ట. అప్పటినుండి వారికి విజయాలు సిద్ధించాయని జానపదుల నమ్మకం. దసరా రోజున ఒకరికొకరు ఆలింగనం చేసుకొని, జమ్మి ఆకులతో బాటుగా క్రొత్తగా వచ్చిన ధాన్యం కంకులను పెద్దల చేతుల్లో పెట్టి వారికి పాదాభివందనం చేస్తారు. ఆశీస్సులు తీసుకుంటారు. దేవాలయాలను కూడా దర్శిస్తారు..



శమీ చెట్టు! చింతచెట్టులాగా ఉంటుంది.. కాని గులాబీ కొమ్మలకు ఉన్నట్లు ముల్లులుతో ఉంటుంది..పాండవులు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసినప్పుడు విజయదశమి రోజున - ఈ చెట్టుపైనే తమ ఆయుధాలను దాచిపెట్టారు.. అందుకే విజయదశమి రోజున ఈ చెట్టుకి మోకరిల్లటం!.. దసరారోజున ఈ చెట్టు ఆకులను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవటం, ఆలింగానాలు చేసుకొని, శుభాకాంక్షలు చెప్పుకోవటం కూడా ఒక సాంప్రదాయం. ఈ ఆకులను "బంగారు ఆకులు" అని కూడా అంటారు. తెలంగాణా జిల్లాల్లో బంగారం గా పిలుచుకుంటారు..

పాండవులు - ఆయుధాలు అనే కథనే కాకుండా ఇంకో కథ కూడా ఉంది. అదేమిటంటే - పూర్వకాలములో కౌత్సకుడు అనే విద్యార్థి వరతంతు అనే అనే గురువు వద్ద అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. చివర్లో గురుదక్షిణ ఇస్తానని పట్టుపడతాడు. వద్దు వద్దు అని ఎంత చెప్పినా ఆ విద్యార్థి వినకపోవటముతో, అలా గయితే నాకు 14 కోట్ల బంగారు నాణేలు గురుదక్షిణగా ఇవ్వమంటాడు ఆ గురువు. ఆందుకోసం అతడు అయోధ్య రాజు శ్రీరాముని పూర్వికుడైన రఘురాజు ని సంప్రదిస్తాడు. ఆ రాజు వద్దకూడా అంత డబ్బు లేక ఆ రాజు ఇంద్రుణ్ణి ఆశ్రయిస్తాడు. ఆ ఇంద్రుడు కుబేరుడి వద్దకి పంపుతాడు. అప్పుడు ఆ కుబేరుడు అయోధ్యలోని శమీవృక్షం నుండి బంగారు నాణేలని కురిపిస్తాడు. వాటిలోంచి గురుదక్షిణ ఇవ్వగా మిగిలిన నాణేలని ప్రజలకి, ఈ శుక్ల దశమి రోజున ఆ కౌత్సకుడు పంచేస్తాడు. అందుకే ఆ ఆకులని దాచుకుంటే సంపద వృద్ధి చెందుతుందని అనే నమ్మకం స్థిరపడిపోయింది.

No comments:

Related Posts with Thumbnails